: నాంపల్లి కోర్టులో హై సెక్యూరిటీ!... ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పై హత్యాయత్నం కేసు విచారణే నేపథ్యం!

హైదరాబాదులోని నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వద్ద నేటి ఉదయం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసులు తుపాకులు చేతబట్టి అక్కడ రంగంలోకి దిగారు. ఎంఐఎం కీలక నేత, తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీపై గతంలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో అక్బరుద్దీన్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా బుల్లెట్ గాయాల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులు తన ప్రత్యర్థి వర్గానికి చెందిన వారేనని తెలుసుకున్న ఎంఐఎం నేతలు షాక్ తిన్నారు. తదనంతరం ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ కూడా చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ మరికాసేపట్లో జరగనుంది. ఈ విచారణకు అక్బరుద్దీన్ తో పాటు ప్రత్యర్థి వర్గం కూడా హాజరవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకే పోలీసులు అక్కడ భారీ సంఖ్యలో మోహరించారు.

More Telugu News