: అసూయకు పరాకాష్ట!... 18 రోజుల మేనల్లుడిని రెండో అంతస్తు నుంచి కిందపడేసిన యూపీ మహిళ!

నిజమే... ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన అసూయకు పరాకాష్టగా నిలుస్తోంది. తనకు ముగ్గురు ఆడ పిల్లలుండగా, వదిన మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆ నగరానికి చెందిన ఓ మహిళ సహించలేకపోయింది. గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రిలోని బెడ్ పై ఉన్న 18 రోజుల వయసున్న మేనల్లుడిని ఆ అత్త రెండో అంతస్తు నుంచి కిందకు పడేసింది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు వచ్చేసింది. అయితే రెండంతస్తుల నుంచి కింద పడ్డ ఆ బాలుడు నిజంగా మృత్యుంజయుడే అని చెప్పాలి. అత్త చేతి నుంచి కింద పడ్డ ఆ బాలుడు నేరుగా భూమిని తాకలేదు. మధ్యలోనే ఉన్న ఓ వలలో పడ్డాడు. బాలుడు కనిపించక ఆసుపత్రి మొత్తం వెతికిన బాలుడి కుటుంబ సభ్యులు చివరకు ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వేగంగా స్పందించిన ఆసుపత్రి సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపట్టగా... ఆసుపత్రి బయట గాలిలో వేలాడుతున్న వలలో ఆ బాలుడు సజీవంగా ఉండటాన్ని ఆసుపత్రి వార్డుబాయ్ గమనించాడు. వెంటనే అక్కడికి ఎలాగోలా చేరుకున్న వార్డుబాయ్ ఆ బాలుడిని క్షేమంగా బెడ్ పైకి చేర్చాడు. ఈ క్రమంలో తన కాలికి బలమైన గాయమైనా ఆ వార్డు బాయ్ బాలుడిని కాపాడాడు. ఇక ఆసుపత్రి బెడ్ పై ఉన్న బాలుడు వలలో ఎలా పడ్డాడన్న కోణంలో ఆరా తీసిన ఆసుపత్రి సిబ్బంది సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నోరెళ్లబెట్టారు. బాలుడిని కింద పడేసింది స్వయానా అతడి అత్తేనని తెలుసుకుని వారు షాక్ కు గురయ్యారు.

More Telugu News