: జార్ఖాండ్ జిల్లాను హడలెత్తిస్తున్న 'ఎగిరే పాము'!

జార్ఖండ్ లోని గుమ్లా జిల్లా కుంహారియా పంచాయతీ ప్రజలను ఫ్లైయింగ్ స్నేక్ (ఎగిరే పాము) వణికిస్తోంది. ఇందులో విశేషమేంటంటే ఆ పామును ఇంత వరకు ఎవరూ చూడలేదు. అయితే ఆ పాము కరిచిందని 25 మంది గ్రామస్థులు పేర్కోవడం విశేషం. దీనిని అవకాశంగా చేసుకున్న నాటువైద్యులు, మంత్రగాళ్లు ఆ గ్రామంలో తిష్టవేసి వైద్యం పేరిట హడావుడి చేస్తున్నారు. వారిని నమ్మిన పలువురు ఆశ్రయిస్తుండడంతో వారి వీపుపై ప్లేటు ఉంచి, మంత్రాలు ఉచ్చరిస్తున్నారు. ఈ ప్లేటు ఎప్పుడైతే కిందపడుతుందో అప్పుడు వారి శరీరం నుంచి పాము విషాన్ని లాగేసినట్టనే చిత్రమైన లాజిక్ తో వైద్యం చేస్తున్నారు. తొలుత ఈ పాము ఇద్దరు అన్నదమ్ములను కాటేసిందని, ఆ తరువాత 23 మందిని కాటేసిందని వారు చెబుతున్నారు. వారిలో ఓ వ్యక్తి ఈ పాము కాటువల్లే మరణించాడని వారు చెబుతున్నారు. అయితే ఓ తాంత్రికుడు దీనిపై మాట్లాడుతూ, అది పామైనా లేదా ఇతర కీటకమైనా సరే విషం శరీరంలోకి ఎక్కుతుందని, దానినే తాము తీసేస్తున్నామని పేర్కొనడం విశేషం. మరి, ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి ఈ మిస్టరీని ఛేదిస్తుందేమో చూద్దాం!

More Telugu News