: మదర్ థెరెస్సాకు సెయింట్ హుడ్... కోట్లాది మంది వీక్షణ

ప్రముఖ క్రైస్తవ సన్యాసిని మదర్ థెరెస్సాకు రోమ్ లోని వాటికన్ సిటీలో సెయింట్ హుడ్ ప్రధానం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో లక్షలాది మంది క్రైస్తవులు పాల్గొన్నారు. ఎక్కడో యుగోస్లేవియాలో సాధారణ కుటుంబంలో జన్మించి, ధెరెస్సాగా రోమన్ క్యాథలిక్ నన్ గా జీవితం ప్రారంభించి, మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సేవల్లో భాగంగా కోల్ కతా మురికివాడల్లోని అన్నార్తుల సేవలో తరించి మదర్ థెరెస్సాగా వినుతికెక్కిన ఆమె కీర్తి కిరీటంలో నోబెల్ బహుమతి కూడా చేరింది. పోప్ ఫ్రాన్సిస్ సారధ్యంలోని ప్రత్యేక బృందం కాననైజేషన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నుంచి వందలాది క్రైస్తవ నన్ లు, మత గురువులు, బిషప్ లు, అర్చ్ బిషప్ లు, కార్డినళ్లు, లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దీంతో వాటికన్ లోని సెయింట్ పీటర్స్ బసిలికా ముందు సువిశాల ప్రాంగణం జన సంద్రంగా మారింది. సీఎన్ఎన్, బీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయడంతో కోట్లాది మంది క్రైస్తవులు ఈ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొన్నారు. భారత్ నుంచి ఈ పవిత్ర కార్యక్రమంలో భాగమయ్యేందుకు కోల్‌ కతా ఆర్చిబిషప్ థామస్ డిసౌజా ఆధ్వర్యంలో 45 మంది బిషప్‌ లు, మదర్ థెరీసా స్థాపించిన లిటిల్ ఫ్లవర్స్ చారిటీ మిషనరీల నుంచి 50 మంది నన్స్, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో 12 మంది సభ్యుల బృందం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాలు పంచుకున్నారు.

More Telugu News