: బంగారానికి ఒక్కసారిగా పెరిగిన డిమాండ్, పుంజుకున్న దిగుమతులు

ఇండియాలో పండగ సీజన్ ప్రవేశించడం, శ్రావణమాసంలో జరిగిన శుభకార్యాలు బంగారానికి డిమాండ్ ను పెంచాయి. దీంతో దిగుమతులు గణనీయంగా పెరిగాయి. ఇక వినాయక చవితి, ఆపై రెండో వారంలో ఓనమ్, వచ్చ నెల రెండో వారంలో దసరా, తరువాత దీపావళి వంటి పండగలు బంగారం కొనుగోళ్ల దిశగా ప్రజలను నడిపిస్తాయని భావిస్తున్న ఆభరణాల వర్తకందారులు బంగారాన్ని ముందుగానే దిగుమతి చేసుకుంటున్నారు. ఇదే సమయంలో మూడు నెలల కనిష్ఠస్థాయిలో ధరలు ఉండటం కూడా దిగుమతులను ప్రభావితం చేస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలతో బంగారం ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ భండారి అభిప్రాయపడ్డారు. ఇండియాలో సంతృప్తికరంగా ఉన్న వర్షాలు కొనుగోలు సెంటిమెంట్ ను పెంచుతున్నాయని, దీంతో జ్యూయెలర్స్ వ్యాపారులు బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నారని తెలిపారు. గడచిన జూలైలో 20 టన్నుల బంగారం దిగుమతి కాగా, ఆగస్టులో 35 నుంచి 40 టన్నుల వరకూ ఇంపోర్ట్ అయి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో పాత బంగారాన్ని మార్చుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని తెలుస్తోంది. కాగా, శుక్రవారం నాడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 30,845గా నమోదైన సంగతి తెలిసిందే.

More Telugu News