: 'డేటాగిరీ' పోరులోకి బీఎస్ఎన్ఎల్... రూ. 1కే 1 జీబీ అంటూ సంచలన ప్రకటన

ఇండియాలో కొనసాగుతున్న టెల్కోల యుద్ధంలోకి ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కూడా దిగింది. ఉచిత కాల్స్ అంటూ రిలయన్స్ జియో ఇచ్చిన ఆఫర్ వెనుక మొబైల్ కస్టమర్లు ఉరుకులు, పరుగులు పెడుతున్న వేళ, ఒక్క రూపాయికే వన్ గిగాబైట్ డేటాను అందిస్తూ, బీఎస్ఎన్ఎల్ సంచలన ప్రకటన చేసింది. వైర్ లైన్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా ఈ డేటా లభిస్తుందని, సెప్టెంబర్ 9 నుంచి రూ. 249 ప్లాన్ తో అపరిమిత డేటాను వాడుకోవచ్చని పేర్కొంది. వినియోగదారులు నెలకు 300 జీబీ డేటాను వాడుకుంటే, వారికి రూ. 1 కన్నా తక్కువకే గిగాబైట్ డేటా అందినట్టని వెల్లడించింది. ఈ స్కీం కింద వినియోగదారులు అపరిమితమైన బ్రాడ్ బ్యాండ్ డేటాను డౌన్ లోడ్ చేసుకోవచ్చని, 2 ఎంబీపీఎస్ స్పీడు లభిస్తుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. ఆరు నెలల పాటు ఈ ప్రమోషనల్ ఆఫర్ వర్తిస్తుందని, ఆపై కస్టమర్ తనకు నచ్చిన రెగ్యులర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ కు వెళ్లవచ్చని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. కాగా, ఈ ప్లాన్ తీసుకుంటే, ఇంట్లోని కంప్యూటర్ కు వైర్ ద్వారా, ట్యాబ్, స్మార్ట్ ఫోన్లు తదితరాలకు వైఫై రూటర్ల ద్వారా డేటాను పొందవచ్చు.

More Telugu News