: ‘జియో’ ఫీవర్.. బ్లాక్‌లో రిలయన్స్ సిమ్‌కార్డులు, అప్లికేషన్లు

ప్రస్తుతం దేశంలో ‘జియో’ ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రాంతాలతో సంబంధం లేకుండా ఏ ఇద్దరు కలిసినా ఈ సిమ్‌కార్డుల కోసమే మాట్లాడుకుంటున్నారు. సిమ్‌కార్డును దక్కించుకునేందుకు క్యూలలో గంటలకొద్దీ నిల్చుంటున్నారు. నిద్రాహారాలు మాని లైన్లలో నిలబడుతున్నారు. మూడు నెలలపాటు అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్, డేటా అందుబాటులో ఉండడంతో సిమ్‌ను దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రిలయన్స్ జియో దెబ్బకు ఇతర నెట్‌వర్క్‌లు తమ డేటా ప్యాక్‌ల ధరలను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. మరోవైపు జియో సిమ్‌లకు అనూహ్య స్పందన రావడంతో కొందరు ఈ సిమ్‌లను బ్లాక్ చేస్తున్నారు. ముంబైలో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంది. అక్కడ ఈ సిమ్‌ కోసం యువతీయువకుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండడంతో సిమ్‌లను కొందరు కావాలనే బ్లాక్ చేస్తున్నారు. సిమ్‌కార్డును రూ.500కు విక్రయిస్తుండగా అప్లికేషన్‌ను సైతం వంద రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే రూ.500 మాత్రమే కాదు.. వెయ్యి రూపాయలైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మొబైల్ వినియోగదారులు చెబుతుండడం గమనార్హం. కాగా జియో సేవలు రేపటి(5వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు నెలలపాటు అంటే డిసెంబరు 31వ తేదీ వరకు జియో ఫ్రీ సేవలు అందుబాటులో వుంటాయి.

More Telugu News