: సినిమాలు యువత మనసును కలుషితం చేస్తున్నాయి: మద్రాసు హైకోర్టు అసంతృప్తి

సినిమాలు యువత మనసును కలుషితం చేస్తున్నాయంటూ నేటి సినిమాల తీరుపై మద్రాసు హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రేమ పేరుతో చెన్నైలోని పదహారేళ్ల విద్యార్థిని వెంటపడి తనను ప్రేమించకపోతే చంపేస్తానని ఆ అమ్మాయిని బెదిరించిన ప్రభుకుమార్ (19) కేసు విచారణ సందర్భంగా మద్రాసు హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. హింస, అసభ్యపదాలతో కూడిన పాటలను తమ చిత్రాల్లో చూపిస్తూ యువకుల మనసులను చిత్ర దర్శక, నిర్మాతలు కలుషితం చేస్తున్నారన్నారు. ఇటువంటి వాటి వల్ల మన సంస్కృతి పక్కదారిపడుతోందన్నారు. యువతలో మంచి ఆలోచనలు కలిగించే బాధ్యతను దర్శక నిర్మాతలు విస్మరించరాదంటూ న్యాయస్థానం సూచించింది. కాగా, తన తల్లితో కలిసి వెళ్తున్న సదరు విద్యార్థిని ఉద్దేశిస్తూ ఒక సినిమాలోని అసభ్యపదజాలంతో కూడిన పాటను ప్రభు పాడాడు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న ప్రభుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ వైద్యనాథ్ బెయిల్ మంజూరు చేశారు. పదివేల రూపాయల బాండ్లను రెండింటిని పూచీకత్తుగా సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిందితుడు ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని ఆదేశించారు.

More Telugu News