: మధ్యాహ్నం తరువాత తేరుకున్న స్టాక్ మార్కెట్... కీలకమైన 8,800 పాయింట్లను దాటిన నిఫ్టీ

సెషన్ ఆరంభం నుంచి స్వల్ప లాభాల్లో ఊగిసలాట మధ్య సాగుతున్న సూచికలు, మధ్యాహ్నం 2 గంటల తరువాత ఒక్కసారిగా దూసుకెళ్లాయి. యూరప్ మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను నిలుపగా, సెన్సెక్స్, నిఫ్టీలు 16 నెలల గరిష్ఠాన్ని తాకాయి. నిఫ్టీ సూచిక అత్యంత కీలకమైన 8,800 పాయింట్ల స్థాయిని అధిగమించింది. రిలయన్స్ జియో ఆఫర్ల దెబ్బకు వరుసగా రెండవ రోజూ టెలికం స్టాక్స్ నష్టపోయాయి. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ సైతం నష్టపోయింది. శుక్రవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 108.63 పాయింట్లు పెరిగి 0.38 శాతం లాభంతో 28,532.11 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 0.40 శాతం లాభంతో 8,809.65 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.49 శాతం, స్మాల్ కాప్ 0.36 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 33 కంపెనీలు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా మోటార్స్, మారుతి సుజుకి, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, కోల్ ఇండియా, రిలయన్స్, ఏసీసీ, ఇన్ఫోసిస్, జడ్ఈఈఎల్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,895 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,528 కంపెనీలు లాభాలను, 1,198 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. గురువారం నాడు రూ. 1,10,60,698 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,11,08,054 కోట్లకు చేరింది.

More Telugu News