: పాక్ జట్టు ఇంతగా దిగజారిపోవడం అసహ్యం కలిగిస్తోంది: కోచ్ ఆవేదన

పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై ఆ జట్టు కోచ్ మికీ ఆర్ధర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగో వన్డేలో ఘోర ఓటమిపాలైన అనంతరం ఆయన మాట్లాడుతూ, పాక్ జట్టు ఆటతీరు ఇలాగే ఉంటే త్వరలో జరగనున్న వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ లలో ఆడడం కూడా అనుమానం కలిగిస్తోందని అన్నారు. పాక్ జట్టు ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్ లో 9వ ర్యాంకులో కొనసాగుతోంది. ఇంగ్లండ్ పై ఓటమి తరువాత ఆ జట్టు ర్యాంకింగ్ లో ఎలాంటి మార్పు లేనప్పటికీ, వరల్డ్ కప్ లో ర్యాంకింగ్స్ లోని టాప్ 8 జట్లకు మాత్రమే స్థానం ఉంటుంది. తరువాతి ర్యాంకుల్లో ఉన్న జట్లు అంటే పాక్ కంటే తక్కువ స్థాయి కలిగిన ఐర్లాండ్, యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్, కెన్యా వంటి జట్లతో పోటీ పడి విజయం సాధించాలి. వాటిపై విజయం సాధించిన టాప్ రెండు జట్లు మాత్రమే వరల్డ్ కప్ లో ఆడేందుకు అర్హత పొందుతాయి. అయితే వరల్డ్ కప్ ను గెలుచుకున్న పాకిస్థాన్ జట్టు ఆటతీరు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక లోపాలు ఏంటో గుర్తించాలని కోచ్ సూచించారు. ఇంత దిగజారిపోవడం అసహ్యం కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆటతీరును సమీక్షించుకోవాలని ఆయన పాక్ ఆటగాళ్లకు సూచించారు.

More Telugu News