: ఓటుకు నోటు కేసు... కట్టుకథల కేసే!: హైకోర్టు వ్యాఖ్యలను గుర్తు చేసిన ధూళిపాళ్ల!

తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపిన ఓటుకు నోటు కేసుపై టీడీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ప్రత్యక్ష ప్రమేయం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్న ఈ కేసును ఆయన కట్టు కథల కేసుగా అభివర్ణించారు. ఈ కేసు పునర్విచారణను నిలుపుదల చేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై కొద్దిసేపటి క్రితం విజయవాడలో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు... కట్టుకథల కేసు అని గతంలోనే హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఈ కేసు అసలు ఏసీబీ పరిధిలోకే రాదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల మధ్య ఉండాల్సిన వైసీపీ నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని, ఎవరెన్ని కుట్రలు చేసినా తమకొచ్చిన నష్టమేమీ లేదని ఆయన చెప్పారు.

More Telugu News