: 17 మంది మహిళలకు మ‌త్తుమందిచ్చి ఆప‌రేష‌న్ చేయ‌కుండా వెళ్లిపోయిన డాక్ట‌ర్‌!

ఉత్తరప్రదేశ్‌ మహరాజ్గంజ్ ప్రాంతంలోని జాన్పూర్‌లో ఓ ప్రభుత్వ వైద్యుడు 17 మంది మ‌హిళ‌లకు ఆప‌రేష‌న్ చేయ‌డం కోసం మ‌త్తుమందు ఇచ్చి త‌న పని పూర్తి చేయ‌కుండానే వెళ్లిపోయాడు. దీంతో ఆ మ‌హిళ‌ల బంధువులు తీవ్ర ఆందోళ‌న చెందాల్సి వ‌చ్చింది. మ‌హిళ‌లను ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్లేలా డాక్ట‌ర్ ప్ర‌వ‌ర్తించాడ‌ని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారు ఆందోళనకు దిగడంతో అక్కడి సిబ్బంది స్పందించి తమపై అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. ఆసుప‌త్రిలో 17 మంది మహిళ‌ల‌కు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఈ శ‌స్త్ర‌చికిత్స డాక్ట‌ర్‌ ప్రవీణ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గాల్సి ఉంది. ఆప‌రేష‌న్ చేసే ఉద్దేశంతో మొద‌ట ప్రవీణ్ కుమార్ ఆ మహిళలకు మ‌త్తు మందు ఇవ్వాల‌ని అక్క‌డి సిబ్బందికి చెప్పాడు. మ‌త్తుమంతు ఇచ్చిన త‌రువాత శ‌స్త్ర‌చికిత్స చేసేందుకు అవసరమైన సామగ్రి లేదంటూ స‌ద‌రు డాక్ట‌ర్ ఆసుప‌త్రి నుంచి ఎక్క‌డికో వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో ఆగ్ర‌హించిన స‌ద‌రు మహిళల బంధువులు ఆందోళన చేప‌ట్టారు. అక్క‌డి ఆశా వర్కర్లు డీఎం, జాన్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు స‌మాచారం అంద‌జేశారు. ఆ ప్రాంత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఏ కూడా అక్క‌డికి రావాల్సి వ‌చ్చింది. మ‌హిళ‌ల‌కు మ‌త్తుమందిచ్చి వెళ్లిపోయిన నాలుగు గంట‌ల త‌రువాత ప్ర‌వీణ్ కుమార్ అక్క‌డ‌కు మ‌ళ్లీ వ‌చ్చాడు. అయితే అప్ప‌టికే మ‌త్తుమందు తీసుకున్న 17 మంది మ‌హిళ‌లు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. అక్క‌డకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు వ‌చ్చిన మరో 13 మంది మ‌హిళ‌ల‌కు ప్ర‌వీణ్ కుమార్ రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు శ‌స్త్ర‌చికిత్స జ‌రిపాడు. డాక్ట‌ర్ నిర్వాకంపై స్పందించిన‌ డీఎం ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపి నివేదిక అందించాల‌ని చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ని ఆదేశించారు.

More Telugu News