: గుప్తుల స్వర్ణయుగాన్ని మరచిపోతాం... సువర్ణాక్షరాలతోనే 'అమ్మ' చరిత్ర: తమిళనాడు అసెంబ్లీలో మార్మోగిన జయలలిత నామస్మరణ

తమిళనాడులో జయలలితో రెండో దఫా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 100 రోజులు అయిన సందర్భంగా అన్నాడీఎంకే పార్టీ శాసనసభ్యులు ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. పోటీలు పడి మరీ జయలలితపై ప్రశంసల జల్లు కురిపించారు. అమె వంటి నేత ప్రపంచంలో మరెవరూ లేరని కొనియాడారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ఆనందంగా బల్లలు చరుస్తుంటే, స్పీకర్ ధనపాల్ పావుగంట పాటు జయలలితను పొగడుతూ చేసిన ప్రకటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అశోక చక్రవర్తి సహా ఏ రాజు కూడా అమ్మలాగా ప్రజలను పాలించలేదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ధనపాల్ మాట్లాడుతూ, "అశోకుడు జనరంజకంగా పాలించాడంటారు. నేను పోల్చి చూస్తూ అధ్యయనం చేశాను. అమ్మ పాలన అశోకుడి ఘనతను మించింది. సువిశాల సామ్రాజ్యమున్నప్పటికీ, నాటి అశోకుడి పాలన నేటి అమ్మ పాలన కంటే గొప్పదేమీ కాదు. అన్ని రంగాల్లో అశోకుని మించింది అమ్మ పాలనే మిన్న. గుప్తుల కాలం స్వర్ణయుగమని చరిత్ర చెబుతోంది. ఇకపై చరిత్రకారులు అమ్మ పాలనకు మించిన పాలన లేదని చెబుతారు. అమ్మదే నిజమైన స్వర్ణయుగమని చరిత్రకారులు రాయనున్నారు" అంటూ తన భక్తిని చాటుకున్నారు. ఇక తమిళనాడులో 100 రోజుల ఉత్సవాల సందర్భంగా సచివాలయం, అసెంబ్లీ తదితర ప్రాంతాలను విద్యుత్ దీపాలు, పూల తోరణాలతో అలంకరించారు. ఈ ప్రాంతాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోయాయి.

More Telugu News