: మరో మైలురాయిని అధిగమించిన భారత్.. 6వేల మెగావాట్లు దాటిన అణు విద్యుదుత్పత్తి

అణు విద్యుదుత్పత్తిలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. 6 వేల మెగావాట్ల అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, ఈ ఘనత సాధించింది. తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం ప్రారంభమయ్యాక అణువిద్యుత్ ఉత్పత్తిలో భారత్ ఎంతో ప్రగతి సాధించింది. అంతకుముందు కూడంకుళంలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుపై ఎన్నో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. చివరికి అన్ని ఆటంకాలను ఎదుర్కొని ప్రారంభమైన విద్యుత్ కేంద్రం ఉత్పత్తిలో దూసుకుపోతూ ముందడుగు వేస్తోంది. కూడంకుళం విద్యుత్ ప్లాంట్‌లోని యూనిట్-II రెండు నెలల క్రితం వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. దీంతో ఇండియాలోని మొత్తం 22 న్యూక్లియర్ రియాక్టర్లు కలిసి 6,780 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకున్నాయి. కాగా మరో నాలుగు అణు రియాక్టర్లు నెలకొల్పాలని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్) భావిస్తోంది.

More Telugu News