: నువ్వు రాజకీయాల్లో ఐదేళ్లే అధికారంలో ఉంటావు... నేను రిటైర్మెంట్ వరకు ఉంటా!: టీడీపీ నేతపై తుపాకీ ఎక్కుపెట్టిన కానిస్టేబుల్

కరీనగర్ జిల్లా జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...కరీనంగర్ జిల్లా జైలులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయ్ రమణారావు, ఇతర నేతలు ఉన్నారు. వారిని పరామర్శించేందుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు కొంత మంది టీడీపీ నేతలను జైలులో ఉన్నవారితో మాట్లాడేందుకు అనుమతించారు. దీంతో వారు లోపలికి వెళ్లారు. ఈ సమయంలో మరి కొంతమంది టీడీపీ నేతలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని ఓ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. దీంతో ఆయనను ప్రశ్నించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కానిస్టేబుల్ వారిపై మండిపడ్డాడు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంతో ఆగ్రహానికి లోనైన కానిస్టేబుల్ టీడీపీ నేతపై తుపాకీ ఎక్కుపెట్టి బయటకు వెళ్లిపోవాలని సూచించాడు. దీనికి ఆయన ఎదురు తిరగడంతో మండిపడ్డ ఆ కానిస్టేబుల్....'నేనిక్కడ డ్యూటీ చేస్తున్నా, చెమ్చాగిరీ చేయడం లేదు. నువ్వు రాజకీయాల్లో అధికారంలోకి వస్తే ఐదేళ్లే పదవిలో ఉంటావు, నేను రిటైర్మెంట్ వరకు విధుల్లోనే ఉండాలి, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు' అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. దీంతో అక్కడ కలకలం రేగింది.

More Telugu News