: మహానందిలో కుంభవృష్టి... రూ.2 కోట్లతో నిర్మిస్తున్న రహదారి తెగిపోయిన వైనం
కర్నూల్ జిల్లా మహానందిలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుంభవృష్టి కారణంగా మండలంలోని పలు గ్రామాలు జలమయం అయ్యాయి. వరదనీటి ప్రవాహం కారణంగా మండల కేంద్రం ఎం.తిమ్మాపురం నుంచి జమాలయస్వామి దర్గా మీదుగా శ్రీనగరం వెళ్లేందుకుగాను రూ.2 కోట్లతో నిర్మిస్తున్న రహదారి తెగిపోయింది. ఈ రహదారికి సమీపంలో ఉన్న విద్యుత్ ఉపకేంద్రం వద్ద నిర్మించిన వంతెన చివరి భాగంలో భారీ గండి ఏర్పడింది. దీంతో పలు పంటలు నీట మునిగాయి. నల్లమల అడవులు, తెలుగు గంగ ప్రధాన కాలువ నుంచి ప్రవహిస్తున్న వర్షపు నీటితో తిమ్మాపురం, హబ్బీపురం, బొల్లవరం, బుక్కాపురం గ్రామాల్లోని వరి, మొక్కజొన్న, పసుపు, కంది, అరటి పంటలతో మునగ తోటలు నీట మునిగాయి. బిందు సేద్యం పైపులు, పరికరాలు వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి.