: అక్టోబర్ 1 నుంచి టెలికాం స్పెక్ట్రం వేలం... ఖజానాకు రూ. 5.56 లక్షల కోట్ల రాబడి!

ఇండియాలో అతిపెద్ద టెలికం తరంగాల వేలం అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. వాస్తవానికి సెప్టెంబర్ 29 నుంచి వేలం మొదలు కావాల్సి వుండగా, నమూనా వేలానికి, వాస్తవ వేలానికి మధ్య మూడు రోజుల సమయం ఉండాలని టెలికం ఆపరేటర్లు డిమాండ్ చేసిన నేపథ్యంలో తరంగాల వేలం తేదీని మార్చినట్టు నేడు సవరించిన ఎన్ఐఏ (నోటీస్ ఇన్వైటింగ్ అప్లికేషన్) ప్రకటనలో టెలికం శాఖ పేర్కొంది. సెప్టెంబర్ 26 నుంచి 27 వరకూ నమూనా వేలం జరుగుతుందని తెలిపింది. నమూనా వేలంలో పాల్గొన్న కంపెనీలు తరంగాలు, వాటి ధరను బేరీజు వేసుకోవడానికి మూడు రోజుల సమయం పడుతుందని ఆపరేటర్లు విన్నవించిన కారణంగానే తేదీని మార్చినట్టు టెలికం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ వెల్లడించారు. హిందువులు శుభకరమని భావించే దినాల్లోనే వేలం మొదలు కావడం యాదృచ్చికమని ఆయన అన్నారు. కాగా, ఈ వేలంలో మొత్తం 2354.55 మెగాహెర్జ్ ల తరంగాలు వేలానికి రానున్నాయి. ఈ వేలం ద్వారా కేంద్ర ఖజానాకు రూ. 5.56 లక్షల కోట్ల రాబడి వస్తుందని అంచనా. ఈ తరంగాలు కూడా అందుబాటులోకి వస్తే, సెల్ ఫోన్ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News