: పేటీఎంకు పోటీగా 'ఫోన్ పే'ను దించిన ఫ్లిప్ కార్ట్

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తన సొంత డిజిటల్ వ్యాలెట్ 'ఫోన్ పే'ను ఆవిష్కరించింది. ఇప్పటికే పేటీఎం, ఫ్రీచార్జ్ వంటి డిజిటల్ వ్యాలెట్లు అందుబాటులో ఉండగా, వాటితో పోటీ పడుతూ, సాధ్యమైనంత ఎక్కువ మార్కెట్ వాటా లక్ష్యంగా నాలుగు నెలల్లో రూ. 6,600 కోట్ల విలువైన లావాదేవీలు లక్ష్యంగా ఫ్లిప్ కార్ట్ ఈ తాజా చెల్లింపు విధానాన్ని ప్రారంభించింది. చైనా దిగ్గజం అలీబాబా అండగా, స్నాప్ డీల్, పేటీఎం సంస్థలు దూసుకుపోతున్న వేళ, తన పరిధిలోని చెల్లింపులకు సైతం డిజిటల్ వ్యాలెట్ ఉండాలన్న లక్ష్యంతో ఈ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్)ని తయారు చేసినట్టు సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా బ్యాంకు ఖాతా నుంచే నగదు లావాదేవీలు జరుగుతాయని, మొబైల్ వ్యాలెట్ లో నిధులు దాచాల్సిన అవసరం లేదని ఫ్లిప్ కార్ట్ తేల్చి చెప్పింది. కాగా, ఈ సంవత్సరం ఏప్రిల్ లో డిజిటల్ పేమెంట్ మీడియేటర్ సేవలందిస్తున్న 'ఫోన్ పే'ను కొనుగోలు చేసిన ఫ్లిప్ కార్ట్, ఆపై దాన్ని యూపీఐగా మార్చింది. దీన్ని బ్యాంక్ ఆధారిత వ్యాలెట్ గా మార్చేందుకు యస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక దీన్ని ప్రమోట్ చేసేందుకు నిర్ణయించుకున్న ఫ్లిప్ కార్ట్, 'ఫోన్ పే' మాధ్యమంగా జరిపే కొనుగోళ్లగు భారీ రాయితీలు ఇవ్వాలని భావిస్తోంది. 'ఫోన్ పే'ను మరింతగా విస్తరించేందుకు భారీ ప్రణాళికలను రూపొందించినట్టు సీఈఓ సమీర్ నిగమ్ వెల్లడించారు. ఈ సంవత్సరం చివరి నాటికి 2.5 నుంచి 3 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు, కోటి మంది యాక్టివ్ యూజర్లను పొందడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఇదిలావుండగా, పేమెంట్ గేమ్ లో ఫ్లిప్ కార్ట్ ఆలస్యంగా ప్రవేశించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. గత సంవత్సరం ఏప్రిల్ లోనే స్నాప్ డీల్ సంస్థ 400 మిలియన్ డాలర్లతో 'ఫ్రీచార్జ్'ని సొంతం చేసుకుని, దాన్ని నడిపేందుకు ఎయిర్ టెల్ మనీ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోవింద్ రాజన్ ను రంగంలోకి దించి విజయవంతమైంది. ఇక పేటీఎంకు ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా అండ ఉంది. ఇండియాలో ఇప్పటికే నంబర్ వన్ డిజిటల్ వ్యాలెట్ గా ఉన్న పేటీఎంలో 10 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ 'ఫోన్ పే' ఏ మేరకు విజయవంతం అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

More Telugu News