: సమ్మె విరమణకు ససేమిరా అంటున్న ట్రేడ్ యూనియన్లు... అధికారులను అత్యవసరంగా పిలిపించుకున్న ప్రధాని

శుక్రవారం నాడు ట్రేడ్ యూనియన్లు, బ్యాంకులు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విరమించుకునేందుకు ససేమిరా అంటున్న వేళ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన ప్రధాని మోదీ, యూనియన్ నేతలకు సర్దిచెప్పాలని కోరారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయుష్ గోయల్, బండారు దత్తాత్రేయ తదితర మంత్రులు హాజరు కాగా, సమ్మెను విరమింపజేసే మార్గాలను అన్వేషించాలని ప్రధాని సూచించారు. కాగా, శుక్రవారం నాటి సమ్మెలో బ్యాంకులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఫ్యాక్టరీలు మూతపడనుండగా, వీరితో కలుస్తామని రైల్వే ఎంప్లాయిస్ యూనియన్లు మాత్రం చెప్పలేదు. పలు రాష్ట్రాల యూనియన్లు సమ్మెకు మద్దతిస్తామని తెలిపాయి. తమ నెలసరి కనీస వేతనాన్ని రూ. 9 వేల నుంచి రూ. 18 వేలకు పెంచాలన్న ప్రధాన డిమాండు సహా 12 డిమాండ్లతో యూనియన్లు సమ్మెకు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఫార్మా, డిఫెన్స్ రంగాల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచుతూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలను సైతం వెనక్కు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News