: సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలు హాస్యాస్పదం...ఆర్బీఐ, కేంద్రం కలిసి పనిచేస్తాయి: దువ్వూరి సుబ్బారావు

బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై చేస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలు హాస్యాస్పదమని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాయని అన్నారు. ప్రజలకు ఏది మంచిది అనిపిస్తే దానినే ఆర్బీఐ అమలు చేస్తుందని ఆయన చెప్పారు. ఆర్థిక నేరాలపై మీడియా సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాలని, వివిధ కార్యక్రమాల ద్వారా వారిని చైతన్యవంతం చేయాలని ఆయన సూచించారు. కోట్ల రూపాయల అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వారిని గుర్తించడం కష్టమని ఆయన చెప్పారు. పరిశ్రమలకు అప్పులివ్వడం తప్పు కాదని, అయితే వాటిని వసూలు చేసుకోవడంలో బ్యాంకులు కొంచెం వినూత్నంగా పని చేయాలని ఆయన సూచించారు. అందరూ దొంగలు అనుకోవడం సరికాదని, అలా అనుకుంటే దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని అన్నారు. డిమాండ్ తో పాటు ఇన్ ఫ్లేషన్ పెరుగుతుందని, దీనిని తగ్గించడమే సవాలని ఆయన తెలిపారు.

More Telugu News