: రూ. 501కి ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో 4జీ ఫోన్ 'చాంప్ వన్ సీ1'... చిన్న మెలికతో రిజిస్ట్రేషన్స్!

'ఫ్రీడమ్ 251' పేరిట రూ. 251కే స్మార్ట్ ఫోన్ అంటూ రింగింగ్ బెల్స్ సంచలనం సృష్టించిన ఘటనను మరువకముందే మరో కంపెనీ 'చాంప్ వన్ సీ1' పేరిట రూ. 501కే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కూడిన స్మార్ట్ ఫోన్ ను ఆఫర్ చేస్తోంది. దీని రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కాగా, 24 గంటల్లో ప్రీ రిజిస్టర్ ఆఫర్ ముగుస్తుందని, సెప్టెంబర్ 2న ఫ్లాష్ సేల్ ఉంటుందని సంస్థ ప్రకటించింది. కాగా, క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో లభించే ఈ ఫోన్ ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఓ చిన్న మెలిక పెట్టింది. ముందుగా, తాము విక్రయిస్తున్న 'చాంప్ 1 క్లీన్ మాస్టర్'ను రూ. 51 చెల్లించి కొనుగోలు చేయాలని, అలా కొన్నవారికే ఫ్లాష్ సేల్ లో పాల్గొనే అవకాశం లభిస్తుందని ప్రకటించింది. క్లీన్ మాస్టర్ కొన్నవారికి సీరియల్ నెంబర్ లభిస్తుందని తెలిపింది. కాగా, ఈ ఫోన్ లో 4జీ తో పాటు 1.3 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 5 అంగుళాల డిస్ ప్లే, 8/5 ఎంపీ కెమెరాలు, 16 జీబీ మెమొరీ, సదుపాయాలుంటాయని తెలిపింది. కాగా, ఈ ఫోన్ ఫ్లాష్ సేల్ లో భాగంగా లభిస్తుంది కాబట్టి, రూ. 51 కట్టి క్లీన్ మాస్టర్ కొన్నవారందరికీ ఫోన్ చేతికి అందుతుందన్న గ్యారంటీ ఉండదు. స్మార్ట్ ఫోన్ కస్టమర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించి, ఈ తరహా ఆఫర్లపై ముందడుగు వేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

More Telugu News