: తన స్వీయ చరిత్రను రూ. 60 కోట్లకు విక్రయించిన ధోనీ!

ఒకప్పుడు రాంచీలో టీటీఈగా పనిచేసినప్పటి నుంచి, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు తెచ్చుకున్న క్రికెట్ స్టార్లలో ఒకడిగా వెలుగొందుతున్న ధోనీ, తన బయోపిక్ ను రూ. 60 కోట్లకు విక్రయించినట్టు 'డైలీ డాట్ భాస్కర్ డాట్ కామ్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 'ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' పేరిట ధోనీ కథ చిత్ర రూపంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ అజారుద్దీన్, సచిన్ వంటి ఆటగాళ్ల బయోపిక్ లు తెరకు ఎక్కినప్పటికీ, వారంతా ఆటకు రిటైర్ మెంట్ చెప్పిన తరువాతే జీవిత కథలు చిత్రాలుగా మారాయి. ఇంకా ఆడుతూనే ఉన్న క్రికెటర్ చరిత్ర, సినిమాగా రూపొందడం మాత్రం ధోనీ విషయంలోనే జరుగుతోంది. తన జీవితంలోని కొన్ని ముఖ్యాంశాలను ధోనీ పంచుకున్నాడని, జీవిత కథ చిత్రంగా తీసేందుకు అంగీకరించిన వెంటనే నిర్మాతలు రూ. 20 కోట్లను ధోనీకి ఇచ్చారని తెలుస్తోంది. మిగతా డబ్బు చిత్రం విడుదలైన తరువాత ఇచ్చే ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఈ చిత్రం సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

More Telugu News