: సచిన్ టెండూల్కర్ నా కోసం రెడ్ కలర్ బీఎండ‌బ్యూ కారును సెలెక్ట్ చేశారు: పి.వి. సింధు

భార‌త క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ రమేశ్ టెండూల్కర్ రేపు హైద‌రాబాద్‌కు వచ్చి భార‌త రియో ఒలింపిక్స్ స్టార్‌లు పి.వి. సింధు, దీపా క‌ర్మాక‌ర్‌, సాక్షిమాలిక్‌, కోచ్‌ గోపిచంద్‌ల‌కు బీఎండ‌బ్యూ కార్లను అందించనున్న విషయం తెలిసిందే. దీనిపై పి.వి. సింధు స్పందించింది. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టెండూల్కర్ తన కోసం రెడ్ కలర్ కారు సెలెక్ట్ చేశారని త‌న‌కు తెలిసిందని పేర్కొంది. స‌చిన్ చేతుల మీదుగా తాను బ‌హుమ‌తినందుకోనుండ‌డం తనకు ఎంతో ఆనందం క‌లిగించే అంశమ‌ని సింధు వ్యాఖ్యానించింది. అకాడమీలో బ్యాడ్మింట‌న్ సాధ‌న‌ చేయ‌డానికి ఇక‌పై తాను ఆ కారులోనే వెళ‌తాన‌ని ఆమె చెప్పింది. ప్రస్తుతం తాను బిర్యానీ, ఐస్‌క్రీంలు తింటూ హ్యాపీగా గ‌డుపుతున్నట్లు పేర్కొంది. త‌న‌ బ్రాండ్ విలువ అంశంపై తాను పట్టించుకోనని చెప్పింది. తన దృష్టంతా ఆటపైనే పెట్ట‌నున్న‌ట్లు తెలిపింది. రానున్న సిరీస్‌ల కోసం త్వ‌ర‌లోనే సాధ‌న మొదలుపెట్ట‌నున్న‌ట్లు చెప్పింది. ఒలింపిక్స్ స్టార్ల‌కు తెలంగాణ బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్‌తో పాటు ప‌లువురు వ్యాపార‌వేత్త‌లు బీఎండ‌బ్యూ కార్ల‌ను స్పాన్స‌ర్ చేస్తున్నారు. సింధుకు తెలంగాణ బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ చీఫ్‌ చాముండేశ్వరినాథ్ కారును స్పాన్స‌ర్ చేశారు. సింధుకు బ‌హూక‌రించనున్న కారును సచిన్ స్వయంగా సెలక్ట్ చేశాడని ఆయ‌న మీడియాకు చెప్పారు. సింధుకు గ‌తంలోనూ తాను రెండు కార్లు ఇచ్చిన‌ట్లు చాముండేశ్వరినాథ్ తెలిపారు.

More Telugu News