: భారీ సంస్కరణలు అక్కర్లేదు... చిన్న మార్పులు చేస్తే ఇండియా దూసుకెళుతుంది: రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు

ఇండియాను అభివృద్ధి పథంలో నిలపాలంటే భారీ సంస్కరణలేమీ అక్కర్లేదని, చిన్న చిన్న మార్పులు, స్థిరమైన నిర్ణయాలు ఉంటే సరిపోతుందని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. త్వరలో తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్న ఆయన ఫెడాయ్ (ఫారిన్ ఎక్స్ఛేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. పన్ను సంస్కరణలను అమలు చేసే బదులు అభివృద్ధికి ముఖ్యమైన మౌలిక రంగాలు వంటి విభాగాల్లో ప్రత్యక్ష సబ్సిడీ విధానాన్ని అమలు చేస్తే మేలు కలుగుతుందని కేంద్రానికి ఆయన సూచించారు. మరీ అతిగా పన్ను రాయితీలు ఇవ్వడం కారణంగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగం రిస్క్ లో పడిపోతుందని, దాని ప్రభావం ఏనాటికైనా వృద్ధి రేటును కుంగదీస్తుందని రాజన్ అభిప్రాయపడ్డారు. ఇన్ ఫ్రా ప్రాజెక్టులకు బ్యాంకులు విరివిగా రుణాలను అందించాలని సలహా ఇచ్చారు. ప్రస్తుతం అమలవుతున్న విధానాలకే చిన్న చిన్న మార్పులు చేసి ఇండియాను వృద్ధి బాటన పరుగులు పెట్టించవచ్చని ఆయన పేర్కొన్నారు.

More Telugu News