: ప్రపంచ రికార్డు దిశగా తాపేశ్వరం సురుచి ఫుడ్స్... వినాయకుడికి 12,500 కేజీల లడ్డూ తయారీ

రానున్న వినాయక చవితి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ భారీ లడ్డు తయారీకి శ్రీకారం చుట్టింది. వినాయక చవితిని పురస్కరించుకుని వచ్చే నెల 5న విశాఖపట్నంలోని గాజువాకలో భారీ వినాయకుడిని నిలబెట్టనున్నారు. గణేశుడి చేతిలో పెట్టేందుకు భారీ లడ్డును తయారుచేసి ఇవ్వాలని భావించిన సురుచి ఫుడ్స్ ఏకంగా 12,500 కేజీలతో భారీ లడ్డు తయారీకి శ్రీకారం చుట్టింది. ఖైరతాబాద్‌లోని అతిపెద్ద వినాయకుడికి ప్రతి ఏడాది లడ్డును తయారుచేసి పంపించేది సురచి ఫుడ్సే. ఆ సంస్థ అధినేత పీవీవీఎస్ మల్లికార్జునరావు 2010 నుంచి లడ్డును ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ఖైరతాబాద్ గణేశుడికి మల్లికార్జునరావు 6 వేల కేజీల లడ్డును పంపించారు. అయితే నిమజ్జనం అనంతరం భక్తులకు దానిని పంచిపెట్టేందుకు గణేశ్ ఉత్సవ్ నిర్వాహకులకు తలకు మించిన భారంగా మారింది. దీంతో ఈసారి కేవలం 500 కేజీల లడ్డును మాత్రమే తయారుచేయాలని కోరారు. ఈసారి మరింత భారీ లడ్డు తయారుచేసి గిన్నిస్ రికార్డులోకి ఎక్కాలని భావిస్తున్న రావు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ్ నిర్వాహకుల కోరికతో నిరాశ చెందారు. దీంతో ఈసారి విశాఖపట్నంలో నిలబెట్టనున్న భారీ వినాయకుడి చేతిలో పెట్టేందుకు 12,500 కేజీల లడ్డును తయారుచేయాలని భావించారు. ఇందుకోసం స్నేహితుల నుంచి అవసరమైన నిధులను సేకరించారు. కాగా గుజరాత్‌ అంబాలాలోని అరసూరి అంబాజీ మాతా దేవస్థానంలో ఆధ్వర్యంలో తయారుచేసిన 11,115 కేజీల లడ్డు ఇప్పటి వరకు అతి భారీ లడ్డుగా ఖ్యాతికెక్కింది.

More Telugu News