: హోం వర్క్ చేయని, అల్లరి చేసే విద్యార్థులకు వినూత్న శిక్ష!

పాఠశాలల్లో పిల్లలు అల్లరి చేయడం సర్వసాధారణం. మరి కొందరు ఆటల్లో పడి హోం వర్క్ మర్చిపోతుంటారు. అలాంటి వారిని దారికి తేవడం ఉపాధ్యాయులకు కాస్త కష్టమైన పనే... అయితే సూరత్ లోని ఓ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం పిల్లలపై బెత్తం దెబ్బ పడకుండా వినూత్నమైన శిక్ష విధించి, వారిని దారిలోకి తీసుకొస్తున్నారు. అదాజన్ ప్రాంతంలోని విద్యాకుంజ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేష్ పటేల్ అల్లరి చేసే విద్యార్థులను దారిలోకి తెచ్చుకునేందుకు వినూత్నమైన విధానం అవలంబిస్తున్నారు. గత 20 రోజులుగా ఆయన అనుసరిస్తున్న ఈ విధానం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో అల్లరి చేసే, మాట వినని, హోంవర్క్ చేయని విద్యార్థులకు గ్లాసుడు వేప రసం ఇస్తున్నారు. తప్పు చేస్తే దానిని దించకుండా తాగాలి. లేదా తప్పు చేయడం మానేయాలి. సహజంగా చేదు పట్ల పిల్లల్లో ఉండే అయిష్టం వారిని మళ్లీ తప్పు చేయకుండా చేస్తోందని, గత 20 రోజులుగా తాము సత్ఫలితాలు సాధించామని, ఈ విధానం పిల్లలకి ఆరోగ్యదాయకం కూడా అని ఆయన చెబుతున్నారు. చేదు తీవ్రత తగ్గించేందుకు వేప రసంలో నీళ్లు కలుపుతున్నట్టు ఆయన తెలిపారు.

More Telugu News