: పాకిస్థాన్ లో రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య!

'పాకిస్థాన్ ఏమీ నరకం కాదు' అని వ్యాఖ్యానించి, తీవ్ర విమర్శల పాలై నిన్న కోడిగుడ్ల దాడికి గురైన కన్నడ నటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ పాకిస్థాన్ లో మాత్రం రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది. రమ్య పాక్ పై చేసిన వ్యాఖ్యలు, ఆపై ఇండియాలో ఆమెపై వేసిన కేసులు, తాజా కోడిగుడ్ల దాడి తదితరాలను అక్కడి పత్రికలు, ప్రసార మాధ్యమాలు పోటీపడి ప్రసారం చేశాయి. రమ్య గత చరిత్రతో ప్రత్యేక కార్యక్రమాలు చూపించాయి. దీంతో ఆమె పాక్ గడ్డపై సెలబ్రిటీగా మారిపోయింది. 'పాక్ ను పొగిడిన భారత నటిపై దేశద్రోహం కేసు' అని 'డాన్' పత్రిక ప్రత్యేక వార్తను ప్రచురించింది. దీనిపై పాఠకుల అభిప్రాయాలు కోరగా, అసంఖ్యాకంగా ఆమెకు మద్దతు తెలుపుతూ సందేశాలు పంపారు. పాక్ పై చేసిన వ్యాఖ్యలకు రమ్య క్షమాపణలు చెప్పేందుకు అంగీకరించలేదు అని 'డైలీ పాకిస్థాన్' తన కథనంలో రాసుకొచ్చింది. 'పాక్ నరకం కాదు... ఇట్లు రమ్య' అనే శీర్షికతో డైలీ టైమ్స్ స్పెషల్ స్టోరీని ఇచ్చింది. ఇక జియో న్యూస్ చానల్ మరికాస్త లోతుగా వెళ్లి, రమ్య గురించి మరింత తెలుసుకుని, ఆమె అసలు పేరు దివ్య స్పందన అని, పాక్ కు అనుకూలంగా మాట్లాడి కేసుల్లో ఇరుక్కుందని కథనాలు ఇచ్చింది. ఇలా ఇండియాలో కోడిగుడ్ల దాడికి గురైన రమ్య పాక్ గడ్డపై మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది.

More Telugu News