: కేన్సర్ బాధిత చిన్నారి కోసం రజత పతకాన్ని వేలానికి పెట్టిన ఒలింపియన్!

కంటి కేన్సర్‌తో బాధపడుతున్న మూడేళ్ల చిన్నారి వైద్యం కోసం రియో ఒలింపిక్స్‌లో తాను గెలుచుకున్న రజతపతకాన్ని వేలం వేయాలని నిర్ణయించుకున్నాడు పోలెండ్‌కు చెందిన డిస్కస్ త్రో క్రీడాకారుడు పియోటర్ మలచౌస్కి(33). ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు. చిన్నారి ఒలెక్ రెండేళ్ల నుంచి కంటి కేన్సర్‌తో బాధపడుతున్నాడని, సాయం అందించాలని కోరుతూ బాలుడి తల్లి నుంచి తనకు ఓ లేఖ అందిందని క్రీడాకారుడు పేర్కొన్నాడు. న్యూయార్క్‌లో చికిత్స ద్వారా పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నట్టు ఆమె రాసినట్టు వివరించాడు. దీంతో తన మెడల్ వేలం వేయడం ద్వారా వచ్చే సొమ్మును బాలుడికి అందించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నాడు. ‘‘రియోలో నేను స్వర్ణం కోసం పోరాడా. కానీ ఇప్పుడంతకంటే విలువైన దాని గురించి పోరాడాలని ప్రతి ఒక్కరికీ పిలుపునిస్తున్నా’’ అని పియోటర్ శుక్రవారం తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చాడు. ‘‘మీరు సాయం చేస్తే నేను సాధించిన రజత పతకం చిన్నారి ఒలెక్‌కు బంగారం పతకం కంటే గొప్పగా మారుతుంది’’ అని రాశాడు. ఈ పోస్టులు పెట్టిన కాసేపటి తర్వాత మరో పోస్టులో ‘‘సక్సెస్’’ అని రాస్తూ సాయం అందించే చేతులు ముందుకొచ్చినట్టు పేర్కొన్నాడు.

More Telugu News