: నా బిడ్డలా తోడుగా ఉంటానని ప‌వ‌న్ కల్యాణ్ చెప్పారు: వినోద్ తల్లి వేదవతి

సినీన‌టుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలోని ఆయ‌న అభిమాని వినోద్ రాయ‌ల్‌ ఇంటికి చేరుకుని వినోద్ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. త‌న కొడుకు చివ‌రిసారిగా ఫోనులో మాట్లాడిన సంభాష‌ణను ఆమె ప‌వ‌న్‌కు తెలిపి కన్నీరు పెట్టుకుంది. పవ‌న్ అక్క‌డి నుంచి తిరుగు ప‌య‌నమయ్యారు. ఈ సంద‌ర్భంగా వినోద్ తల్లి వేద‌వ‌తి మీడియాతో మాట్లాడారు. త‌న‌ బిడ్డలాగా తోడుగా ఉంటానని ప‌వ‌న్ త‌న‌తో చెప్పిన‌ట్లు తెలిపారు. త‌మ కుటుంబానికి తగిన న్యాయం జరుగుతుందని ఆయ‌న అన్న‌ట్లు పేర్కొన్నారు. బిడ్డ‌ను కోల్పోయిన‌ తల్లి బాధ ఏంటో తనకు తెలుసని పవన్ అన్నార‌ని, త‌న‌కు ధైర్యం చెప్పారని ఆమె తెలిపారు. తన బిడ్డ భగవంతుడి వద్దకు వెళ్లిన తరువాత కూడా ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్నాడని ఆమె అన్నారు. తన గుండె కోతలో పవన్ పాలు పంచుకున్నాడని ఆమె వ్యాఖ్యానించారు. తన కుమారుడు సమాజ సేవలో పాలుపంచుకునే వాడని, తన కొడుకు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తాను బయలుదేరుతానని ఆమె అన్నారు. కడుపుమంటతో తన కొడుకుని చంపేశారని అన్నారు. ఇటువంటి ఘటన రాష్ట్రంలో జరగడం తొలిసారని, ఇదే చివరిసారి కావాలని ఆమె వ్యాఖ్యానించారు.

More Telugu News