: నివురు గప్పిన నిప్పులా ‘అభిమాన పోరు’... పవన్ కల్యాణ్ పర్యటనతో తిరుపతిలో హైటెన్షన్

ఆదివారం రాత్రి కర్ణాటక పరిధిలోని కోలార్ లో ఇద్దరు టాలీవుడ్ హీరోల అభిమానుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని వినోద్ రాయల్ చనిపోయిన ఘటన చిత్తూరు జిల్లాలో చిన్నగా నిప్పు రాజేస్తోంది. కోలార్ లో జరిగిన ఘర్షణలో టాలీవుడ్ యంగ్ హీరో అభిమాని కత్తితో దాడి చేయడంతో వినోద్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ మరునాడు అతడి మృతదేహాన్ని తిరుపతికి తీసుకునివచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినోద్ బంధువులతో పాటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వినోద్ మరణానికి కారణమైన యంగ్ హీరో అభిమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వినోద్ స్నేహితులు, కేసును సీబీసీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తాజాగా నేడు వినోద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ తిరుపతి వెళుతున్నారు. దీంతో నిన్నటిదాకా కాస్తంత సద్దుమణిగిందనుకున్న ఈ వివాదం గంటల వ్యవధిలోనే తీవ్ర రూపం దాల్చింది. వినోద్ ను చంపేసిన యంగ్ హీరో అభిమానిపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నిరసనలకు తెర తీశారు. వెరసి పవన్ కల్యాణ్ పర్యటనతో తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

More Telugu News