: కేసీఆర్! నీలా చిల్లర మాటలు మాకు రావా?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

సెంట్రల్ వాటర్ కమిషన్ 160 టీఎంసీ నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని అనుమతులిస్తే...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 240 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తామంటున్నారని టీఎస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 'సరే పోనీ మీరంటున్నట్టే 240 టీఎంసీల నీటినే తెలంగాణకు తీసుకొస్తారని అనుకుందాం. అలా తెచ్చిన 240 టీఎంసీల నీటిలో 40 టీఎంసీల నీరు స్వీపేజ్ ఎవాపరేషన్ లో పోయిన తరువాత, 30 టీఎంసీల నీరు హైదరాబాదు నగరానికి నీటి కేటాయింపుల్లో ఇస్తారు. ఈ మొత్తం నీటిని మినహాయించిన తరువాత, 10 టీఎంసీలు విలేజ్ డ్రింకింగ్ వాటర్ అవసరాలకు కేటాయిస్తారు. 16 టీఎంసీలు ఇండస్ట్రీలకు కేటాయిస్తారు. ఇవన్నీ పోగా సాగునీటి అవసరాలకు మిగిలేది 144 టీఎంసీల నీరు మాత్రమే" అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం లేదా ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం చూసినా ఒక టీఎంసీ నీటికి 12 వేల ఎకరాల వరి లేదా ఇతర ఆరుతడి పంటలు; 8 నుంచి 10 వేల ఎకరాల మధ్యలో ఇతర నీటి ఆధారిత పంటలు సాగు చేసుకోవచ్చని, ఈ లెక్కన మిగిలిన నీరు 144 టీఎంసీలకి 14 1/2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉండగా, పదేపదే ఆ లెక్కలు 26 లక్షల ఎకరాలను సాగు చేస్తామంటారు. ఇదెలా సాధ్యమని ఆయన నిలదీశారు. 'మరోసారి 36 లక్షల ఎకరాలు సాగు చేస్తామని చెబుతారు. అదెలా సాధ్యమో వారే చెప్పాలి' అని ఆయన డిమాండ్ చేశారు. ఏమన్నా అంటే అవాకులు చవాకులు పేలి, టాపిక్ సైడ్ ట్రాక్ పట్టిస్తారని ఆయన మండిపడ్డారు. 'ఏం నీలా మాకు చిల్లర మాటలు రావా?' అని ఉత్తమ్ ప్రశ్నించారు. కేసీఆర్ భాష తమకు కూడా మాట్లాడడం వచ్చని, అలా మాట్లాడడం సరికాదని ఆయన హితవు పలికారు. తాను దేశానికి సేవ చేసే ఆర్మీ నుంచి వచ్చానని, ఇలాంటి చిల్లర భాష మాట్లాడే వ్యక్తిని కాదని ఆయన చెప్పారు. రాజకీయాలంటే తిట్టుకోవడం మాత్రమే కాదని...ప్రజలకు నిజంగా సేవ చేయాలని ఆయన సూచించారు. 'నిజాలు మాట్లాడడం ముందు నేర్చుకో' అని ఆయన కేసీఆర్ కు సూచించారు. ప్రతిపక్షాలు భాధ్యతగా నిజాలు చెబుతుంటే, ప్రతిపక్షలపై బురద జల్లడం సరికాదని ఆయన చెప్పారు. ఇదే నియంతృత్వ, నిరంకుశ ధోరణితో ప్రతిపక్షాన్ని అణచివేస్తామంటే...తెలంగాణ సమాజం గమనించాలని ఆయన సూచించారు.

More Telugu News