: సచిన్, సెహ్వాగ్ లను వెనక్కి నెట్టిన అశ్విన్

టీమిండియా మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లను ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అధిగమించాడు. విండీస్ తో జరిగిన టెస్టు సిరీస్ లో బ్యాటు, బాల్ తో రాణించి 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' గా నిలిచిన అశ్విన్ ఇప్పటి వరకు ఆరుసార్లు ఈ ఘనతను సాధించాడు. గతంలో టీమిండియా తరపున అత్యధిక 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' ఘనత సాధించిన ఆటగాళ్లుగా సచిన్, సెహ్వాగ్ లు నిలిచారు. వీరిద్దరూ ఐదేసి సార్లు ఈ ఘనతను సాధించారు. సచిన్ 74 సిరీస్ (200 టెస్టులు)లలో ఐదుసార్లు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా నిలవగా, సెహ్వాగ్ 39 సిరీస్ (104 టెస్టులు)లలో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ కేవలం 13 సిరీస్ (36 టెస్టులు) లలో ఆరుసార్లు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచి వారిని అధిగమించాడు. ఇక ప్రపంచంలో అత్యధిక 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు సాధించిన ఆటగాడిగా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ రికార్డుల్లో కొనసాగుతున్నాడు. 61 టెస్టు సిరీస్ లు ఆడిన మురళీధరన్ 11 సార్లు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' గా నిలిచాడు.

More Telugu News