: సింధును 'కర్ణాటక అమ్మాయి'గా మార్చేసిన హర్యాణా ముఖ్యమంత్రి!

ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు ఏ రాష్ట్రానికి చెందిన యువతి? అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. ఈ వివాదం హర్యాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను కూడా చేరినట్టుంది. అందుకే ఆయన సింధు నేటివిటీకి సంబంధించిన ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. సింధు పేరు పలకడంలోనే ఇబ్బంది పడ్డ ఆయన, రియో ఒలింపిక్స్ లో సాక్షి మాలిక్ తో పాటు 'కర్ణాటక అమ్మాయి' పీవీ సింధు కూడా మంచి ప్రదర్శన చేసిందని అంటూ, అచ్చ తెలుగమ్మాయిని కన్నడ అమ్మాయిగా మార్చేశారు. సాక్షి మాలిక్ ను అభినందిస్తూ, ఆమెకు 2.5 కోట్ల పురస్కారం అందజేసిన సందర్భంగా ఆయన సింధు పేరు మర్చిపోయి, ఆమెను కర్ణాటక క్రీడాకారిణిగా పేర్కొన్నారు. కాగా, సింధుకు 50 లక్షల రూపాయల పురస్కారాన్ని హర్యాణా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయ నాయకులు క్రీడాకారుల పేర్లు మర్చిపోవడం మామూలే. దీపా కర్మాకర్ పేరును క్రీడల మంత్రి మర్చిపోయిన సంగతి తెలిసిందే.

More Telugu News