: ఆ రెస్టారెంట్ లో ఆర్డర్ చేశావా?...అయితే తినాల్సిందే...వదిలేస్తే మాత్రం జరిమానా కట్టాల్సిందే!

సాధారణంగా ఓ హోటల్ కు వెళ్లి ఆర్డర్ చేసి, కడుపునిండా తిని ఇంకా మిగిలిపోతే వదిలేసి వెళ్లిపోతుంటాం. కానీ జర్మనీలోని ఓ హోటల్ లో అలా ఆర్డర్ చేసిన తరువాత ప్లేటులో ఆహారం వదిలేసి వెళ్లిపోతే జరిమానా చెల్లించాల్సిందే. జర్మనీలోని స్టుర్ గర్త్ లో యౌకి అనే సుషి రెస్టారెంట్ ఉంది. అక్కడ బఫెట్ తరహాలో ఫుడ్ ఐటమ్స్ వుంటాయి. ఇక మనకు కావలసిన ఇతర పదార్థాలైతే మాత్రం అక్కడి ప్యాట్రన్స్ కు చెప్పి ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే చేయాల్సిందల్లా ప్లేటులో ఆహారపదార్థాలు ఏమాత్రం వదలకుండా లాగించేయాలి. అలా వదిలితే హోటల్ యజమాని లౌన్ గౌయు కు కోపమొచ్చేస్తుంది. దాంతో కస్టమర్ కి జరిమానా విధిస్తాడు. సాధారణంగా పొట్టకంటే కళ్లు పెద్దవిగా ఉంటాయని, అందుకే చాలా మంది ఆర్డర్ చేసిన పదార్ధాలను తినకుండా వదిలేస్తారని ఆయన పేర్కొన్నారు. కొందరు రుచి పేరుతో అన్నింటినీ కొద్దికొద్దిగా ఆరగించి ప్లేట్లలో వదిలేస్తారని, అలాంటి వేస్టేజీని అరికట్టేందుకు జరిమానా విధానం అమలు చేస్తున్నానని ఆయన చెప్పారు. ప్లేటులో ఆహారం మిగిలిస్తే 1.15 డాలర్లు (77 రూపాయలు) విధిస్తున్నానని, ఇలా ఇప్పటి వరకు సేకరించిన జరిమానా 1020 డాలర్లు (సుమారు 68000 రూపాయలు) ఓ ఛారిటీ సంస్థకు అందజేశానని ఆయన తెలిపారు.

More Telugu News