: నయీమ్ తో సంబంధాలు లేవు!...నట్టి కుమార్ ఆరోపణలు నిరాధారమన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే!

గ్యాంగ్ స్టర్ నయీమ్ తో సంబంధాలున్నాయని వెల్లువెత్తుతున్న ఆరోపణలు తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో పెను కలకలమే రేపుతున్నాయి. సినీ నిర్మాత నట్టి కుమార్ రెండు రోజుల క్రితం చేసిన ఆరోపణలు, భువనగిరి వ్యాపారి నాగేంద్రను నయీమ్ బెదిరించినట్లు వెలుగులోకి వచ్చిన ఆడియో ఫుటేజీ ఆ పార్టీలో పెద్ద చర్చకే తెర తీసింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా ఆ పార్టీ నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి... నట్టి కుమార్ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నయీమ్ తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని కనకారెడ్డి చెప్పుకొచ్చారు. నయీమ్ అనుచరులు తన గెస్ట్ హౌస్ లో ఆయుధాలతో తిరిగారన్న ఆరోపణల్లోనూ వాస్తవం లేదన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన నట్టి కుమార్ కు లీగల్ నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అవసరమనిపిస్తే నట్టి కుమార్ పై పరువు నష్టం దావా వేస్తానని కూడా ఆయన చెప్పారు.

More Telugu News