: అరుణ గ్రహం ఒకప్పుడు జీవానుకూలంగా ఉండేదట.. తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు!

ఖ‌గోళ శాస్త్ర‌జ్ఞుల కృషితో విశ్వంలో మనకు తెలియని ఎన్నో అద్భుత అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. భూమిపై కాకుండా వేరే గ్ర‌హంలో ఎక్కడైనా జీవులు ఉన్నాయా? జీవానుకూల వాతావ‌ర‌ణం ఉందా? అనే అంశంపై శాస్త్ర‌వేత్త‌లు ఎప్ప‌టినుంచో ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతూనే ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా అంగారక గ్రహంపై జీవానుకూల వాతావ‌ర‌ణం ఉంద‌నే వాద‌న ఉంది. గతంలోనే ప‌రిశోధ‌కులు ఈ గ్ర‌హంపై నీటి ప్రవాహాలకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. అంగార‌క గ్ర‌హం గురించి మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు చేసిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు తాజాగా మ‌రో విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆ గ్ర‌హంపై ప్ర‌స్తుతం చల్లగా, పొడి వాతావరణం ఉంది. అయితే 400 కోట్ల సంత్స‌రాల క్రితం అక్క‌డ వెచ్చ‌ని వాతావ‌ర‌ణం ఉండేద‌ని వారు పేర్కొన్నారు. దీంతో ఆ గ్ర‌హంలో జీవులు మ‌నుగ‌డ సాగించే వాతావ‌ర‌ణం అప్పట్లో ఉండేద‌ని తెలిపారు. ఆ గ్రహం ఉపరితలంలోని పురాతన ప్రాంతంలో గుర్తించిన పురాత‌న‌ నదీ అవశేషాలను వారు విశ్లేషించారు. 'అరేబియా టెర్రా'గా పిలవబడే అంగారక గ్రహం ఉత్తర ప్రాంతంలో ఈ అవ‌శేషాలను ఇటీవ‌లే గుర్తించారు. వాటిని పూర్తిగా విశ్లేషించిన త‌మ‌కు ఆ గ్ర‌హంపై 400 కోట్ల సంవత్సరాల క్రితం జీవానుకూల వాతావ‌ర‌ణం ఉన్న‌ట్లు తెలిసింద‌ని శాస్త్ర‌వేత్త‌ జోయల్ డెవిస్ తెలిపారు.

More Telugu News