: థ్యాంక్యూ సీఎం సార్!... చంద్రబాబుకు ఎమ్మెల్సీల వినూత్న అభినందనలు!

12 రోజుల పాటు భక్తి పారవశ్యంతో జరిగిన కృష్ణా పుష్కరాలు నిన్నటితో ముగిశాయి. కృష్ణా పరీవాహక ప్రాంతం అధికంగా ఉన్న ఏపీలో లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలాచరించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లపై ఒకరిద్దరు మినహా అంతా హర్షం వ్యక్తం చేశారు. ఇక సీఎం నారా చంద్రబాబునాయుడు 12 రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి పుష్కరాల పర్యవేక్షణకే అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టడంతోనే పుష్కరాలు అద్భుతంగా జరిగాయని టీడీపీ ఎమ్మెల్సీలు భావించారు. ఈ మేరకు వారంతా కలిసి చంద్రబాబుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పయ్యావుల కేశవ్, టీడీ జనార్దన్ ల నేతృత్వంలో నిన్న ఎమ్మెల్సీలంతా చంద్రబాబుకు వినూత్నంగా అభినందనలు తెలిపారు. ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ ముద్రించిన పోస్టర్ ను వారు నిన్న విజయవాడలో ఆవిష్కరించారు. సదరు పోస్టర్ పై చంద్రబాబు ఫొటో కూడా ఉంది. రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈ పోస్టర్ ను ఆవిష్కరించినట్లు కేశవ్ చెప్పారు.

More Telugu News