: నయీమ్ దందాపై 39 కేసులు!... నిన్న ఒక్కరోజే 10 మంది అరెస్ట్!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గ్యాంగ్ స్టర్ నయీమ్ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటిదాకా 39 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతల కోసం తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిన్న కేసు వివరాలను వెల్లడించింది. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఈ నెల 8న జరిగిన ఎన్ కౌంటర్లో నయీమ్ హతమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నయీమ్, అతడి బంధువుల ఇళ్లలో పోలీసులు జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున నగదు, మారణాయుధాలు, కీలక సమాచారం లభించాయి. దీంతో కేసు దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన సిట్ కు పలు వర్గాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన సిట్ ఇప్పటిదాకా మొత్తం 39 కేసులు నమోదు చేసింది. ఇక నిన్న ఈ వ్యవహారంలో అరెస్టుల పర్వం కూడా మొదలైంది. తొలి రోజే 10 మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ ప్రకటించింది. నల్లగొండలో ఆరుగురిని అరెస్ట్ చేసిన సిట్... నయీమ్ సొంతూరులో నలుగురిని అదుపులోకి తీసుకుంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సిట్ ప్రకటించింది.

More Telugu News