: బెంజి సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!... పుష్కరాలకు వచ్చి తిరిగి వెళుతూ ముగ్గురి దుర్మరణం!

ఓ వైపు కృష్ణా పుష్కరాలు... మరోవైపు రియో సిల్వర్ స్టార్ పీవీ సింధుకు ఘన సన్మానం... వెరసి ఏపీ పొలిటికల్ రాజధాని విజయవాడలో పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఇదే సమయంలో నగరం నడిబొడ్డున బెంజి సర్కిల్ వద్ద కొద్దిసేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకువచ్చిన ఓ కారు డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ మహిళతో పాటు మరో చిన్నారి కూడా ఉండటం అక్కడి వారిని కలచివేసింది. కృష్ణా పుష్కరాల్లో చివరి రోజు కావడంతో పుష్కర స్నానం చేసిన ఓ కుటుంబం తిరిగి తమ సొంతూరు వెళుతున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో బెజవాడలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదంలో చనిపోయిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వేగంగా స్పందించిన స్థానికులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

More Telugu News