: ఐటీ ఉద్యోగిని జిగీష హత్య కేసులో శిక్ష ఖరారు చేసిన కోర్టు.. ఇద్దరికి మరణ శిక్ష

ఐటీ ఉద్యోగిని జిగీష హత్య కేసులో న్యాయస్థానం దోషులకు శిక్ష‌ను ఖ‌రారు చేసింది. కేసులో ఇద్దరికి మరణశిక్ష, ఒకరికి జీవిత ఖైదు ప‌డింది. 2009లో ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో జిగీషను కొంద‌రు దుండ‌గులు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హ‌త్య చేశారు. జిగీష త‌న‌ ఆఫీస్ క్యాబ్‌లోంచి త‌న ఇంటి వ‌ద్ద దిగిన వెంట‌నే దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి, ఆమె వద్ద ఉన్న విలువైన సామాగ్రి దోచుకుని ఆ దారుణానికి పాల్ప‌డ్డారు. కేసు ద‌ర్యాప్తు చేస్తోన్న పోలీసుల‌కి హరియాణాలోని సూరజ్‌కుండ్‌ ప్రాంతంలో హ‌త్య జ‌రిగిన మూడు రోజుల తర్వాత ఆమె మృతదేహం ల‌భించింది. సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం రవి కపూర్‌, బల్‌జీత్‌, అమిత్‌ శుక్లాలను దోషులుగా తేల్చిన న్యాయ‌స్థానం ఈరోజు వారికి శిక్ష‌ను ఖరారు చేసింది. జిగీష వద్ద నుంచి ముగ్గురు దోషులు డెబిట్‌కార్డును దొంగిలించారు. అనంత‌రం ఆ కార్డుతో షాపింగ్ చేశారు. దాని ఆధారంగా ద‌ర్యాప్తు చేసిన పోలీసులు సీసీటీవీ కెమెరాల దృశ్యాల ద్వారా వారిని ప‌ట్టుకున్నారు. ముగ్గురు దోషుల‌కి మరణశిక్ష విధించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అయితే, పూర్తి విచార‌ణ అనంత‌రం రవి కపూర్‌, అమిత్‌ శుక్లాలకు మరణశిక్ష విధించిన కోర్టు బల్‌జీత్‌ మాలిక్‌కు మాత్రం జీవిత ఖైదును విధిస్తున్న‌ట్లు పేర్కొంది.

More Telugu News