: తెలుగు రాష్ట్రాలను కలిపిన పీవీ సింధు!... స్టార్ షట్లర్ కు స్వాగతం సందర్భంగా పక్క పక్కనే ఏపీ, తెలంగాణ మంత్రులు!

హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో కొద్దిసేపటి క్రితం ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొంటున్న పలు వివాదాలపై ఆయా రాష్ట్రాలకు చెందిన మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ తరహా ఘాటు కామెంట్లు ఏపీ జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలంగాణకు చెందిన మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ ల నోట వెల్లువలా వినిపిస్తున్నాయి. అయితే రియోలో భారత సత్తా చాటిన పీవీ సింధు వీరిని కలిపేసింది. కొద్దిసేపటి క్రితం శంషాబాదు ఎయిర్ పోర్టుకు చేరుకున్న సింధుకు స్వాగతం పలికేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడికి తరలివెళ్లాయి. ఏపీ తరఫున డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, బెజవాడ ఎంపీ కేశినేని నానిలతో కలిసి దేవినేని ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అదే సమయంలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావులు అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా సింధు కోసం వేచి చూసే క్రమంలో వారంతా ఎయిర్ పోర్టు లాంజ్ ల్లో కూర్చుకున్నారు. అది కూడా పక్కపక్కనే కూర్చున్న వారి మధ్యలో మాటలు కూడా కలిశాయి.

More Telugu News