: రియోలో జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించిన మహిళా క్రికెటర్!

రియో ఒలింపిక్స్ లో అరుదైన అద్భుతం జరిగింది. మహిళల జావెలిన్ త్రో ఈవెంట్ లో దక్షిణాఫ్రికాకు చెందిన సున్నెట్టి విల్జియెన్ సిల్వర్ మెడల్ సాధించింది. దక్షిణాఫ్రికాకు చెందిన సున్నెట్టి వాస్తవానికి అక్కడి ప్రొటీస్ వుమెన్స్ క్రికెట్ టీమ్ లో సభ్యురాలు. ఇప్పటివరకు ఆమె ఒకే ఒక టెస్ట్ మ్యాచ్, 17 వన్డే మ్యాచ్ లు ఆడింది. 2000 సంవత్సరంలో ఆమె వన్డేల్లో ఆడటం ప్రారంభించింది. గమ్మత్తేమిటంటే, సున్నెట్టి పాల్గొన్న ఒకే ఒక టెస్టు మ్యాచ్ టీమిండియాతోనే కావడం గమనార్హం. 2002 లో ఈ టెస్టు మ్యాచ్ జరిగింది. మొదటి ఇన్నింగ్స్ లో 17 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 71 పరుగులు ఆమె సాధించింది. అయితే, క్రికెట్ కెరీర్ నుంచి జావెలిన్ త్రో వైపు ఆమె ఎందుకొచ్చిందంటే, ఒలింపిక్స్ లో పతకం సాధించాలన్న ఒకే ఒక్క కోరికతో ఆమె ఈ దిశగా అడుగులు వేసి, అనుకున్న లక్ష్యాన్ని ధించింది. కాగా, రియో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ లో క్రొయేషియాకు చెందిన సారా కోలక్ స్వర్ణ పతకం సాధించగా, సున్నెట్టి రజత పతకం కైవసం చేసుకుంది. కోలక్ తన జావెలిన్ ను 66.18 మీటర్లు విసరగా, సున్నెట్టి 64.92 మీట్లరు విసిరింది.ఒక క్రికెట్ ప్లేయర్ ఇలా మరో క్రీడలో పాల్గొని, ఒలింపిక్ పతకం సాధించడం ఇప్పుడు పెద్ద విశేషం అయింది.

More Telugu News