: నేలపై పడుకుంది నా బిడ్డ కాదు, నా హృదయం: బ్యాంకు ఉద్యోగి స్వాతి చితాల్కర్

‘నేలపై పడుకుంది నా బిడ్డ కాదు, నా హృదయం’ అంటూ జ్వరంతో బాధ పడుతున్న తన బిడ్డ గురించి ఒక తల్లి చేసిన వ్యాఖ్యలు ఇవి. పుణెకు చెందిన బ్యాంకు ఉద్యోగి స్వాతి చితాల్కర్ బిడ్డకు జ్వరంగా ఉండటంతో, చంకన బిడ్డను వేసుకుని, విధులు నిర్వహించేందుకు ఆమె బ్యాంక్ కు వెళ్లింది. తన చాంబర్ లోనే ఆ బిడ్డను కింద పడుకోబెట్టి, తన విధులను స్వాతి నిర్వహించింది. ఈ బాధంతా ఎందుకు, ఆమె సెలవు పెట్టొచ్చుగా అనే అనుమానం మనకు రావచ్చు. అయితే, అత్యవసర బ్యాంకు రుణాలు విడుదల చేయాల్సి ఉండటంతో ఆమె సెలవు తీసుకోలేని పరిస్థితి వుంది. ఇందుకు సంబంధించిన ఒక ఫొటోను స్వాతి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. అసెంబ్లీలో నిద్రపోయే మంత్రులకు చిన్న సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను ఈ ఫొటోను పోస్ట్ చేశానని ఆమె పేర్కొంది. కాగా, ఈ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. బిడ్డపై తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలిచిన ఈ ఫొటోకు లైక్ లు, షేర్లు బాగానే వస్తున్నాయి.

More Telugu News