: ఏపీలో జనాభా కంటే మొబైల్ ఫోన్ కనెక్షన్లే అధికం.. దేశంలో నాలుగో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

జనాభాకు మించి మొబైల్ ఫోన్ కనెక్షన్లు కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా చేరింది. రాష్ట్ర జనాభా 4.95 కోట్లు కాగా మొబైల్ కనెక్షన్లు మాత్రం 7.48 కోట్లు ఉన్నట్టు తేలింది. పట్టణ, పట్టణాలుగా రూపుదిద్దుకుంటున్న ప్రాంతాల్లో మొబైల్ కనెక్షన్ల సంఖ్య బాగా పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. సమాచార మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 1,026 మిలియన్లకు చేరుకుంది. దేశంలోని అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ మొబైల్ కనెక్షన్ల విషయంలో మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్ నిలిచాయి. మొబైల్ ఫోన్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడం, ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని వినియోగించుకునే వీలుండడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. తక్కువ ధరల్లోనే డేటా ప్యాక్ అందుబాటులో ఉండడంతో ఇంటర్నెట్ కోసం విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు, కొందరు రెండు మొబైళ్లను కూడా వినియోగిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే మొబైల్ కనెక్షన్లు పెరిగినట్టు చెబుతున్నారు.

More Telugu News