: నెహ్రూ దేశం కొంపముంచారు...పీవీ కూడా సంప్రదాయవాదే: అరుణ్ జైట్లీ
స్వాతంత్ర్యానంతరం దేశానికి దిశానిర్దేశం చేశారని సర్వత్ర ప్రశంసలందుకున్న మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, భారత్ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరెన్నికగన్న పీవీ నరసింహారావుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విమర్శలు గుప్పించారు. వీరి పాలనలో దేశం అభివృద్ధి చెందలేకపోయిందని ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, నెహ్రూ విధానాలు దేశం కొంపముంచాయని అన్నారు. ఆయన విధానాల వల్లే దేశం అభివృద్ధి చెందలేకపోయిందని జైట్లీ అభిప్రాయపడ్డారు. నెహ్రూ విధానాలు అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడేవి కాదని ఆయన తెలిపారు. దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరొందిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూడా సంప్రదాయవాదేనని ఆయన తెలిపారు. దేశం దివాలా తీయడం వల్లే ఆయన ఆర్థిక సంస్కరణలు చేపట్టారని, లేని పక్షంలో ఆయన ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఉండేవారు కాదని ఆయన తెలిపారు.