: సింధు మా అందరితోనూ బాగుంటుంది: సింధు క్లాస్ మేట్స్

రియో ఒలింపిక్స్ లో పసిడిపతకానికి తలపడుతున్న పీవీ సింధు విజయం సాధించాలని ఆమె విద్యనభ్యసిస్తున్న హైదరాబాదులోని సెయింట్ ఆన్స్ కళాశాల ఆకాంక్షించింది. ఈ సందర్భంగా ఆమె సహచరులు మాట్లాడుతూ, సింధులో గర్వం లేదని అన్నారు. తరగతిలో అందరితోనూ స్నేహంగా ఉంటుందని చెప్పారు. ఎలాంటి భేషజాలు లేకుండా అందరితో కలిసిపోతుందని వెల్లడించారు. సింధుకు ఒలింపిక్స్ లో పతకం ఖాయమన్న విషయం తెలిసిందేనని పేర్కొన్నారు. అయితే, స్వర్ణం సాధించి దేశానికి స్వర్ణ పతకం సాధించిన తొలి మహిళగా తమ స్నేహితురాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని వారంతా కాంక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ, సింధు ఆరేళ్లుగా తమకు తెలుసని, మంచి స్టూడెంట్ అని అన్నారు. క్రీడల్లో ఆసక్తి కనబరిచినప్పటికీ విద్యను ఏనాడు అశ్రద్ధ చేయలేదని, బాగా చదువుతుందని తెలిపారు. సింధు స్వర్ణం సాధిస్తే బాగుంటుందని, తామంతా స్వర్ణపతకాన్ని కోరుకుంటున్నామని, సర్వశక్తులూ ఒడ్డి ఆడితే స్వర్ణం సింధు వశమవుతుందని ఆమె తెలిపారు.

More Telugu News