: ఢిల్లీలో మరో దారుణం.. 12 ఏళ్ల బాలికను అపహరించి పదేళ్లలో పదిసార్లు అమ్మేసిన వైనం

దేశ రాజధాని ఢిల్లీలో నేరాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. దారుణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. తాజాగా బయటపడిన మరో ఘోరం దీనిని రుజువు చేస్తోంది. ఓ ముఠా చేతికి చిక్కిన 12 ఏళ్ల బాలిక పదేళ్లలో పదిసార్లు విక్రయానికి గురైంది. చివరికి బాలికగా అపహరణకు గురైన ఆమె గత నెలలో యువతిగా ఇంటికి చేరుకోవడంతో ముఠా దారుణాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. జనతా కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలికను జూలై 2, 2006లో రంజు, ఆమె భర్త శ్యామ్ సుందర్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అంబాలాలో ఓ మహిళకు రూ.12 వేలకు అమ్మేశారు. ఆ తర్వాత పదేళ్లలో ఆమెను మరో 9 సార్లు వివిధ వ్యక్తులు పెళ్లి పేరుతో అమ్మేశారు. అలా హర్యాణా, పంజాబ్ రాష్ట్రాలు తిరిగింది. చివరికి పంజాబ్‌లోని సంగ్రూరులో తనకంటే మూడింతలు పెద్దవాడైన ఓ వ్యక్తి ఆమెను కొనుక్కున్నాడు. ఆ తర్వాత అతను ఆమెను ఇంటినుంచి గెంటేశాడు. ఈ పదేళ్లలో ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. పంజాబ్ నుంచి సరాసరి ఢిల్లీ చేరుకున్న బాధిత యువతి గతనెల 25న కుటుంబ సభ్యులను కలిసి తాను ఎదుర్కొన్న దారుణాలను వివరించింది. వారి సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణంపై తీవ్రంగా స్పందించారు. పంజాబ్, హర్యాణాలోని మన్సా, భటీడ, పాటియాలా, సంగ్రూర్, అంబాలా, కురుక్షేత్ర‌లలో ‘సిట్’ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా కరుడుగట్టిన కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుంది. కురుక్షేత్రలో కిడ్నాప్ ముఠా సూత్రధారిగా భావిస్తున్న బబ్లిని అరెస్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని జానాపూర్, బీహార్‌లోని ముజఫర్‌నగర్‌లో కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించిన ఇద్దరు బాలికలను విడిపించింది. అలాగే బాధిత బాలికను వివాహం చేసుకున్న, అమ్మేసిన వ్యక్తులందరినీ అరెస్ట్ చేసినట్టు డిప్యూటీ కమిషనర్ ఏకే సింగ్లా తెలిపారు.

More Telugu News