: పీవోకే నుంచి దయచేయండి.. పాకిస్థాన్‌కు భారత్ ఘాటు హెచ్చరిక

కశ్మీర్ విషయంలో ఇటీవల రెచ్చిపోతున్న పాకిస్థాన్‌కు భారత్ ఘాటు హెచ్చరికలు చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఖాళీ చేస్తే మంచిదని సూచించింది. ఈ విషయంపై చర్చించేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నట్టు భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ తెలిపారు. చర్చల విషయానికి సంబంధించి ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషనర్ పాక్ విదేశాంగ కార్యాలయానికి ఆగస్టు 16న ఓ లేఖ సమర్పించారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదం సహా ఉగ్రవాద కార్యకలాపాలకు పుల్‌స్టాప్ పెట్టడం, హింసను ప్రోత్సహించడం, ఉగ్రవాదులను శిక్షించడం, పాక్‌లోని అన్ని ఉగ్రవాద స్థావరాలను మూసేయడం తదితర డిమాండ్లు అందులో ఉన్నట్టు తెలిపింది. జమ్ము కశ్మీర్ విషయంలో తలదూర్చే హక్కు పాక్‌కు లేదని, కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని ఎంఈఏ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పష్టం చేశారు. ‘‘ఇప్పుడు బంతి వారి(పాక్) కోర్టులోనే ఉంది. వారి ప్రతిపాదనకు మేం అంగీకరించాం. దానిని ముందుకు తీసుకెళ్తారో లేదో వారే నిర్ణయించుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరేంటో స్పష్టంగా తెలియజేశామన్న ఆయన కశ్మీర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు ఉండవని తేల్చి చెప్పారు.

More Telugu News