: టార్గెట్ గోల్డే!... ఫైనల్స్ లో సర్వశక్తులూ ఒడ్డుతానన్న సింధు!

రియో ఒలింపిక్స్ లో భాగంగా మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో ఫైనల్ చేరిన తెలుగు తేజం పీవీ సింధు మరో విజయం సాధిస్తే... భారత్ కు పసిడి పతకం ఖాయమే. నేటి రాత్రి జరగనున్న తుది పోరులో సింధు గెలవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. నిన్న రాత్రి సెమీస్ లో విజయం సాధించిన తర్వాత ఫైనల్ పోరుపై పీవీ సింధు తన వ్యూహాన్ని విస్పష్టంగా ప్రకటించింది. ‘‘నెక్ట్స్ మ్యాచ్ గెలవాలి... ప్రతి మ్యాచ్ తర్వాత ఇదే నా టార్గెట్. ఇక్కడిదాకా వస్తాననుకోలేదు. ఒక్కో మ్యాచ్ గెలుస్తూ వచ్చాను. ఇక ఒక్క మ్యాచ్. ఒకే ఒక్క మ్యాచ్. ఇప్పుడు నా టార్గెట్ గోల్డ్ మెడల్. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడతా. నా సత్తా మొత్తం చూపిస్తా. విజయావకాశాలు కచ్చితంగా నా వైపే ఉన్నాయన్న నమ్మకముంది. ఒత్తిడి వంటిదేమీ లేదు. నా శక్తిని వందశాతం ఉపయోగించడమే ఇక్కడ ముఖ్యం. ఫైనల్స్ కోసం నేను సిద్ధంగా ఉన్నాను. అది అంత సులభమని నేను అనుకోవడం లేదు. కరోలినా మారిన్ నిజంగా బలమైన ప్రత్యర్థి. ఆమె బాగా ఆడుతోంది. అయితే... ఫైనల్స్ లో ఎవరు బాగా ఆడతారన్నదే విజయాన్ని నిర్దేశిస్తుంది. మారిన్ ఎడమ చేత్తో ఆడుతుంది. ఫైనల్స్ కు సంబంధించి కోచ్ పుల్లెల గోపిచంద్ చెప్పిన వ్యూహాలను అనుసరిస్తా’’ అని ఆమె పేర్కొన్నారు.

More Telugu News