: ఈసారి బీజేపీ ఎమ్మెల్యే వంతు!... మద్యం మత్తులో పోలీసుపై చేయి చేసుకున్న మరాఠా నేత!

మహారాష్ట్రలో రాజకీయ నేతలు రెచ్చిపోతున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై ఇష్టారాజ్యంగా పేట్రేగిపోతున్నారు. నిన్నటికి నిన్న ఆ రాష్ట్రంలోని ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్లి డిప్యూటీ కలెక్టర్ చెంప చెళ్లుమనిపించగా, ఆ వెనువెంటనే బీజేపీకి చెందిన మరో ఎమ్మెల్యే ఏకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ పోలీసు గూబ గుయ్యిమనిపించారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకెళితే... నిండా మద్యం మత్తులో మునిగిపోయిన బీజేపీ ఎమ్మెల్యే రామచంద్ర పునజ్ అవసరే... తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బందారా ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. అప్పటికే ఎమ్మెల్యే రాకను గమనించిన పోలీసు అధికారి ఆయనతో మాటలు కలిపారు. ఈ సందర్భంగా తాను టార్గెట్ చేసిన పోలీసును అక్కడికి పిలిపించిన ఎమ్మెల్యే... సివిల్ డ్రెస్ లోని సదరు పోలీసు చెంప చెళ్లుమనిపించారు. వెంటనే తేరుకున్న పోలీసు అధికారి ఎమ్మెల్యేను శాంతపరిచారు. ఈ మొత్తం తతంగాన్ని వీడియోలో చిత్రీకరించిన ఓ వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.

More Telugu News